ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ను ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో కాస్టిక్ సోడా యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి బలభద్రపురం చేరుకున్నారు. అక్కడ కుమార మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళంతో కలిసి ప్లాంట్ సందర్శించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బలభద్రపురం గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 2,700 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంస్థ తొలి క్లోర్ ఆల్కలీ తయారీ కేంద్రాన్ని నిర్మించిందని చెప్పారు. ప్రధానంగా స్థానిక నివాసితులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా గ్రాసిమ్ కంపెనీ అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతుల విషయంలో.. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించే విధానాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దీనికి అంగీకరించటం ద్వారా కాస్టిక్ సోడా యూనిట్లో ప్రత్యక్షంగా 1,300 మందికి మరియు పరోక్షంగా మరో 1,200 మందికి ఉపాధి కలుగనుందని తెలిపారు. అలాగే పరిశ్రమ ప్రాంతంలోని భూగర్భ జలాలు కలుషితం కాకుండా నిరోధించేందుకు గ్రాసిమ్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుందని, జీరోతో కలిపి నీటి-కమ్-ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ మరియు రీసైకిల్ ప్లాంట్ను చేర్చిందని సీఎం జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ