ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో రూ. 147 కోట్లతో, 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు.. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని సీఎం తెలిపారు. కానీ, ప్రభుత్వం ఒక్కో ఇల్లు కట్టటానికి రూ. 6 లక్షలు వరకు ఖర్చు చేస్తోందని సీఎం జగన్ అన్నారు.
అలాగే, జగనన్న కాలనీలో మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు సీఎం తెలిపారు. నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించటం కోసం జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ చెప్పారు. పులివెందుల నియోజక వర్గంలో ఆక్వా హబ్ చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే, ప్రతి మండలంలో ఒక మర్కెటింగ్ గిడ్డంగి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మరో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం కింద నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులు చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు. ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మంది వరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి.. అలాంటి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు కూడా సీఎం జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ