గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు మే 25, సోమవారం నాడు ప్రారంభమైంది. నేటి నుంచి 6 రోజులపాటు పలు అంశాలపై ఈ మేథోమధనం సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వ్యవస్థలో మార్పులు తీసుకువస్తేనే తప్ప ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,162 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, అవినీతి లేని, పారదర్శకత వ్యవస్థను ప్రజల వద్దకే తీసుకెళ్లామన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
మత్స్యకార భరోసా, వాహనమిత్ర, వైఎస్ఆర్ భీమా పథకాలు, మద్యం షాపులు తగ్గింపు, బెల్టు షాపులు తొలగింపు, దిశ పీఎస్ల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి, ఇంగ్లీష్ మీడియంలో విద్యా, ఇక త్వరలో వైఎస్ఆర్ క్లినిక్స్ పేరుతో 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు తీసుకోస్తామని సీఎం చెప్పారు. అలాగే త్వరలో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, గ్రామాల్లో జనతా బజారు కు ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu