ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఆగస్టు 3, సోమవారం నాడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మహిళల జీవితాలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత ప్రారంభిస్తున్నామని, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు చేయూతను అందజేయనున్నామని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.4,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేస్తామని చెప్పారు. అలాగే సెప్టెంబరు నెలలో వైఎస్ఆర్ ఆసరా అమలు చేసి, స్వయం సహాయక సంఘాల వారికి మేలు జరిగేలా చేయనున్నామని సీఎం చెప్పారు. చాలావరకు చేయూత అందుకున్న మహిళలకూ ఆసరా కూడా వర్తిస్తుందని చెప్పారు. 9 లక్షల మంది మహిళలకు ఇప్పటికే దాదాపు రూ.6,700 కోట్లు ఆసరా కింద ఇస్తున్నామని, ఇలా ప్రతి ఏటా రూ.11 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లపాటుగా రూ.44 వేల కోట్లను సుమారు కోటి మంది మహిళలకు అందజేయనున్నామని తెలిపారు. మహిళల జీవితాల్లో వెలుగును నింపుతూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా సహకారం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu