ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు రేపు ప్రారంభం కానున్నాయి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా కేంద్రాలతో పాటుగా కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎం) యాప్ ను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,641 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు రైతులకు సేవలు అందించనున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరాతో పాటుగా భూసార పరీక్షలు కూడా నిర్వహించి వాటి ఆధారంగా ఏఏ పంటలు వేసుకోవచ్చో సూచనలు ఇస్తారు. గ్రామాలలో రైతులు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు సిఫార్సు చేస్తారు. రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్లు ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందించనున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు శిక్షణా తరగతులు మరియు విజ్ఞాన కేంద్రాలుగా కూడా రైతుభరోసా కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu