తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టమైన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రారంభించారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్హౌస్ స్విచ్చాన్ (ప్రారంభం) చేశారు. పంప్ హౌస్ స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్లోకి చేరుకున్నాయి. తర్వాత ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకొని గోదావరి జలాలకు స్వాగతం పలికి, గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు త్వరలోనే గొప్ప తీపి కబురు చెప్పబోతున్నానని, దేశమంతా ఆశ్చర్యపోయేలా ఆ కబురు ఉంటుందని సీఎం చెప్పారు.
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైన ఘట్టమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాలు ప్రవేశించాయని, కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు శిరసు వంచి నమస్కరిస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్వాసితులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని, వారికీ సంపూర్ణ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు ఈ ప్రాజెక్టులు నిదర్శనమన్నారు. ఇంత పెద్ద స్థాయి ప్రాజెక్టు కోసం అహర్నిశలు పనిచేసిన ఈఎన్సీ లకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ తెలిపారు. 165 టీఎంసీల కెపాసిటీతో తెలంగాణ ప్రభుత్వం కొత్త రిజర్వాయర్లు నిర్మించిందని, ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రము కూడా ప్రాజెక్టులను నిర్మించలేదని అన్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టులను గొప్పగా పూర్తి చేశామన్నారు. సీతారామ ప్రాజెక్టు సహా, మిగిలిన ప్రాజెక్టులను కూడా మరి కొద్దీ కాలంలోనే పూర్తి చేస్తామన్నారు. ఇకపై తెలంగాణ రైతాంగం సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయాల పంటను పండించబోతుందని, నియంత్రిత పంటసాగు విధానం ద్వారా వ్యవసాయరంగంలో గొప్ప మార్పులు వస్తాయని చెప్పారు. ఇటీవలే దేశంలో మొత్తం 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే, అందులో సగానికి పైగా రికార్డు స్థాయిలో 53 లక్షలు టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరించినట్టు ఎఫ్సీఐ ప్రకటించిందని అన్నారు. పసిడి పంటల సాగు దిశగా రాష్ట్రం పయనిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu