ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకుల భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం వర్చువల్గా రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అలాగే అక్కడ ప్రత్యేక పోలీస్ ఫోర్సు వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఈ స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారు విధులు నిర్వర్తించనుండగా, టూరిస్టులకు 24 గంటల పాటుగా భద్రత, సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని రీతిలో, గతానికి బిన్నంగా ఏపీ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకుని వచ్చామని చెప్పారు. తాజాగా 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని, పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో నిర్భయంగా గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్స్ దోహదపడతాయని పేర్కొన్నారు. ఒక్కో చోట ఆరుగురు సిబ్బంది, 8 గంటలు, 12 గంటల షిఫ్ట్స్, ఎస్సై లేదా ఏఎస్ఐ పర్యవేక్షణ, ఇతర అన్ని సౌకర్యాలతో ఈ స్టేషన్స్ నడుస్తాయని సీఎం తెలిపారు. పర్యాటకులు, యాత్రికులకు ఎలాంటి భయాలు లేకుండా భరోసా ఇస్తూ, ఇక మీదట ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు సేవలు అందిస్తాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE