కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల తయారీ, సరఫరాను, సరకుల రవాణా వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఈ- పాస్ (ఎమర్జెన్సీ పాస్) ను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
వస్తువులు తయారు చేసే కంపెనీలు, అన్ని రకాల నిత్యావసర వస్తువుల సరఫరాదారులు ఆన్లైన్లో ఈ-పాస్లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈ-మెయిల్ ద్వారా లేదా ఫోన్ కు అనుమతి సర్టిఫికెట్ ను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. అలాగే తయారీ సంస్థలకు, రవాణా కంపెనీలకు మరియు పలు ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిలో ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు అనుగుణంగా ఈ-పాస్లు జారీ చేయనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి ఈ ఈ-పాస్లు అందజేస్తారు. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే ఈ-పాస్లను ఎవరైనా ఫోర్జరీ లేదా దుర్వినియోగం చేస్తే సంబంధిత చట్టం మేరకు శిక్షకు గురవుతారని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
వీరికి ఈ-పాస్ లు అవసరం లేదు:
- ప్రభుత్వ ఉద్యోగులకు
- ఉదయం 6 నుంచి 11 వరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులు కొనుక్కునే ప్రజలకు
- సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి
- పంటను తరలించి అమ్ముకునే రైతులకు ఈ-పాస్లు అవసరం లేదు.