ప్రధాని నరేంద్ర మోదీ 63వ మన్ కీ బాత్ ఎడిషన్లో భాగంగా మార్చ్ 29 , ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా వైరస్ నియంత్రం కోసం తీసుకుంటున్న చర్యలపైనే ఎక్కువుగా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. లాక్డౌన్ ఆంక్షల వలన పేద ప్రజలకు తనపై కోపంగా ఉందని, అలాగే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందువలన తనను క్షమించాలని ప్రధాని మోదీ వేడుకున్నారు. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన కోరికని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా రోజు వారి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే ప్రజలు తమని తాము రక్షించుకోవడంతో పాటుగా తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవాల్సి ఉన్నందువల్లనే లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని తెలిపారు.
ఇటువంటి ప్రతికూల సమయాల్లో ప్రజలంతా ప్రభుత్వాలకు సహకరించాల్సిందిగా కోరారు. ప్రజలంతా ఎవరికీ వారే వారీ ఇంటిముందు కొన్ని రోజుల పాటు ‘లక్ష్మణ రేఖ’ గీసుకుని దాటకుండా ఉండాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. సోషల్ డిస్టాన్సింగ్ (సామాజిక దూరం) పాటిస్తూ కరోనాపై యుద్ధం చేయాలని అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం వైద్యులు, నర్సులు, పారామెడికల్ వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. కరోనాపై పోరాడుతున్న వారీ నుంచి స్ఫూర్తి తీసుకోవాలని ప్రజలను ప్రధాని మోదీ కోరారు.