ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ 4 , శనివారం ఉదయానికి కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, వైద్యసిబ్బంది, ఆరోగ్య సిబ్బందిని అత్యవసర సర్వీసుల చట్టం(ఎస్మా) పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 3,న జీవో జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా పనిచేసేందుకు నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఎస్మా పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు అంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
జీవో ప్రకారం ఎస్మా పరిధిలోకి వచ్చే విభాగాలు:
- ఆరోగ్య శాఖలో అన్ని సర్వీసులకు చెందిన ఉద్యోగులు
- డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది
- పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ సిబ్బంది
- మందుల ఉత్పత్తి, రవాణా సిబ్బంది
- అంబులెన్స్ సర్వీసుల్లో పని చేసే వాళ్ళు
- మంచినీరు, విద్యుత్ సరఫరా సిబ్బంది
- భద్రతా సిబ్బంది
- ఆహార సరఫరా సిబ్బంది
- బయో మెడికల్ వ్యర్థాల తరలింపు.
[subscribe]