కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పేదలకు ఉచితంగా రేషన్, పప్పులు అందజేయడంతో పాటుగా, ప్రతి ఇంటికి ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 4, శనివారం ఉదయం నుంచే గ్రామ వాలంటీర్లు ఇంటింటీకి వెళ్లి లబ్ధిదారులకు రూ.1000 నగదును పంపిణీ చేస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ఉదయం ప్రజాప్రతినిధులు నగదు పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో 1.30కోట్ల బియ్యం కార్డుల్లో మ్యాపింగ్ చేసిన 1.19 కోట్ల కార్డుదారులకు గ్రామ వాలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి నగదు అందిస్తుండగా, మ్యాపింగ్ జరగని 13,12,890 బియ్యం కార్డుదారులకు ఆ గ్రామాల పరిధిలోని గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు/వార్డు సంక్షేమ కార్యదర్శి నగదును అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నగదు పంపిణీకి సంబంధించి 13 జిల్లాలకు అవసరమైన రూ.1,300 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
[subscribe]