కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించింది. దేశ ఆర్ధిక వ్యవస్థపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. గత జనవరి 1 నుంచి ఉన్న పెండింగ్ మొత్తాన్ని కూడా ఉద్యోగులకు చెల్లించేది లేదని ఏప్రిల్ 23, గురువారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది. అలాగే వచ్చే ఏడాది జులై వరకు డీఏలో ఎలాంటి పెంపు ఉండదని పేర్కొన్నారు. పింఛను దార్లకు కూడా జనవరి 1 నుంచి డీఏను నిలిపేస్తున్నట్లు చెప్పారు. జులై, 2021 వరకు ఎలాంటి బకాయిలు చెల్లించేంది లేదని ప్రకటన విడుదల చేశారు.
గతనెలలో ప్రభుత్వ ఉద్యోగుల, పింఛనుదార్ల డీఏ,డీఆర్ లను 17 నుంచి 21 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా సంక్షోభం దృష్ట్యా ఆరోగ్య, సంక్షేమ శాఖ కార్యకలాపాలకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు చేయాల్సి ఉన్నందువలనే కేంద్ర ప్రభుత్వం డీఏ,డీఆర్ చెల్లింపులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.37,530 కోట్లు ఆదా కానుందని సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu