2012లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చ్ 20, శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ముందుగా నిందితుడు ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. అదే విధంగా మరో నిందితుడు పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో నిందితులైన వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్ లు ఆఖరి గంటల్లో కూడా న్యాయపరమైన అవకాశాల పేరుతో న్యాయస్థానాల్లో వరుస పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. చివరి అవకాశంగా తమపై కేసులు పలు న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్నందువలన ముందుగా జారీచేసిన డెత్ వారంట్లను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించేది లేదని తేల్చి చెబుతూ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకు పోవడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారమే రేపు ఉదయం ఐదున్నర గంటలకు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు కానుంది. ఇక నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.