ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ జూన్ 25, గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు ఆయన నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ముందుగా టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవీకాలం మార్చ్ 29, 2023 వరకు ఉండగా, మార్చ్ 9, 2020 వ తేదీనే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈసీ కి పంపించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ తరపున మరోసారి డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి అభ్యర్థి బరిలో ఉండకపోతే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఎవరైనా అభ్యర్థి బరిలో ఉంటే జూలై 6న పోలింగ్ నిర్వహించి, అదేరోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu