దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి నూతన రైల్వే లైన్, దక్షిణకోస్తా రైల్వే జోన్ అభివృద్ధి లాంటి పలు అంశాలపై చర్చలు జరిపారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై వేగవంతంగా చర్యలు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తీసుకోవాల్సినా చర్యలను లిఖిత పూర్వకంగా తెలిపారు. విజయవాడ డివిజన్ అభివృద్ధి చేసి మరింత విస్తరించడంతో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఎంపీలు జీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సమావేశానికి వైసీపీ పార్టీ ఎంపీలయిన రఘురామకృష్ణరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వంగ గీతా, గోరంట్ల మాధవ్, రెడప్ప, శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బలశౌరి, తలారి రంగయ్య, చింతా అనురాధ, బ్రహ్మనంద రెడ్డి, దుర్గా ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యవతి పాల్గొన్నారు. టీడీపీ పార్టీ నుంచి కనకమేడల రవీంద్ర బాబు, కేశినేని నాని హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రానికి సంబంధించి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా రైల్వేల ప్రాజెక్టులు, పనుల విషయంలో జాప్యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశం బహిష్కరించి కేశినేని నాని బయటకు వచ్చేసారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్యాసింజర్ రైలు లైన్ వేసి, ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఉదయభాను కోరారు. రామవరప్పాడు, గుణదల, మధురానగర్ ప్రాంతాల్లో రైల్వే సమస్యలు, పెండింగ్ అంశాలపై మల్లాది విష్ణు రైల్వే జీఎం గజానన్ మాల్యాతో చర్చించారు.
[subscribe]