ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలయింది. ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 48 వేల కోట్ల రూపాయలకు లెక్కలు చూపించలేదని, అన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ఇటీవల యనమల ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోవాలని, లోతైన విచారణ చేయించాలని కోరారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు. అది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్ అనే విషయాన్ని గ్రహించాలని మంత్రి పేర్కొన్నారు. సీఎఫ్ఎంఎస్లో స్పెషల్ బిల్లులంటూ ఏవీ ఉండవని స్పష్టం చేశారు. సీఎఫ్ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో ‘బుక్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్’ను గుర్తించడం కోసం స్పెషల్ బిల్లులు అనే పేరు పెట్టారని, ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగలేదని, అలాంటప్పుడు అవినీతి జరిగిందని ఎలా అంటారని మంత్రి బుగ్గన ప్రశ్నించారు.
అయితే, దీనిపై యనమల రామకృష్ణుడు మరోసారో మీడియా ముందు తన ఆరోపణలను సమర్ధించుకున్నారు. తాను తప్పుడు ఆరోపణలు చేయటం లేదని, కాగ్ ఇచ్చిన నోటీసుల ఆధారంగానే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని, తనకు ఆ అలవాటు కూడా లేదని తెలిపారు. బ్యాక్ఎండ్ లావాదేవీలను ఎలా అనుమతిస్తారని, ప్రత్యేక బిల్లుల పేరుతో 48 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం అంటే ట్రెజరీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని యనమల స్పష్టం పేర్కొన్నారు. ఈ అంశాలపై తనకున్న అనుమానాలను 12 ప్రశ్నల రూపంలో రాష్ట్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్ 360 కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించాలని యనమల కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ