విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజి ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ అనే గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని గాజువాక లోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకోగా, కలెక్టర్ వినయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీని మూసివేయించారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
మరోవైపు పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు కంపెనీలోని రియాక్టర్ వద్ద లీకేజి కారణంగా ప్రమాదం జరిగిందని, సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, సీపీ కంపెనీ వద్దకు చేరుకున్నారని అధికారులు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu