విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేయడంపై అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కర్నూలుకు కార్యాలయాలను తరలించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని తరలింపు అంశంపై పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉండగా కార్యాలయాలను ఎందుకు తరలించారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా కార్యాలయాల తరలింపు ప్రభుత్వ నిర్ణయమని, ఇక్కడ కార్యాలయాల నిర్వహించే తీరు సరిగ్గా లేనందునే తరలించాల్సి వచ్చిందని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై దాఖలైన మరో రెండు లంచ్మోషన్ పిటిషన్లతో కలిపి మూడు పిటిషన్లను మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇరువర్గాల వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
[subscribe]