జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) పై కేంద్రప్రభుత్వం కీలకప్రకటన చేసింది. ఎన్ఆర్సీ అమలుపై ఇప్పటివరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటించారు. లోక్సభలో సమావేశాల్లో ప్రతిపక్షాలు చర్చలను అడ్డుకుంటూ ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈరోజు ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గతంలో పార్లమెంట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. అనంతరం ఎన్ఆర్సీ అంశంపై తమ ప్రభుత్వం ఇంకా చర్చించలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే అస్సాంలో మాత్రమే ఎన్ఆర్సీ అమలు చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోదీ హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ నిత్యానంద్ రాయ్ ఎన్ఆర్సీ అమలుపై లోక్ సభలో అధికారికంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
[subscribe]