పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆయనంటే పడిచచ్చే యువత లక్షల్లో ఉంటారు. ఆయన స్టైల్కు అభిమానులెందరో. సినిమాల్లో ఉంటే ఏడాదికి వెయ్యి కోట్లు తన ఆదాయంటూ చాలాసార్లు పవన్ ప్రకటించారు. వాస్తవంగా కూడా ఇండస్ట్రీలో ఆయనకు అంత క్రేజు ఉంది. కానీ.. అన్నయ్య చిరంజీవిలాగే పవన్ కూడా రాజకీయాల్లో రాణించలేకపోయారు. అవినీతిలేని రాజకీయాలు, అవినీతిని ప్రశ్నించే రాజకీయాలు ఆకట్టుకోలేదో.., చెప్పేఒకటి, చేసేదొకటి అని ప్రజలు నమ్ముతున్నారో తెలియదు కానీ, గత ఎన్నికల్లో ఆయన కూడా గెలవలేకపోయారు. అయినప్పటికీ, ఐదేళ్లపాటు నిలదొక్కుకుని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు.
మరోసారి 2024 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు కూడా పవన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం అని, జనసేన ప్రయోజనాల కోసం నేను ఎన్నడూ ఆలోచన చేయలేదని చెబుతున్నారు. ఏపీ ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత కోసమే నిత్యం ఆలోచిస్తున్నట్లు భీమవరంలో జరిగిన సమావేశంలో మరోసారి వెల్లడించారు. 2014 మార్చి 14 నుంచి రాజకీయ పార్టీ పెట్టినా, అంతకు ఐదేళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగస్టు 26న చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారాజ్యం యువ విభాగమైన ‘యువ రాజ్యం’ అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. పీఆర్పీ ఎంట్రీతో 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైంది. ప్రజారాజ్యంలో తాను అన్నయ్య ఆదేశాలను మాత్రమే అనుసరించానని.. నిర్ణయాధికారం నా చేతుల్లో ఉండేది కాదని పవన్ చెబుతుంటారు.
రాష్ట్ర విభజన ఖాయమయ్యాక.. 2014 ఎన్నికలు మరెంతో దూరంలో లేవనగా.. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ.. ఆయన రాజకీయాల్లో అడుపెట్టారు. పవర్ స్టార్ కాస్తా.. జనసేనానిగా మారారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు. 2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయ్యారు. దీంతో ప్రతిపక్షం పవన్ను ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేసింది. ఇది ప్రజారాజ్యం-2 అని, అన్న పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే.. తమ్ముడి పార్టీ ప్రి పెయిడ్ అనే విమర్శలొచ్చాయి. పవన్ చేసిన మంచి పనుల కంటే ఇవే ఎక్కువగా ప్రచారం జరిగాయి. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని విపక్షం ఆరోపించింది. కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు.
ఈసారి నేరుగా పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. తనను విమర్శించే వైసీపీ నేతలకు సమాధానం చెబుతూ… మీరెన్ని తిట్టినా నేను భయపడను, వెనక్కు తగ్గను అని పవన్ అన్నారు. ” 2014లో కష్టాల్లో ఉన్న టీడీపీకి చేయి అందించి అధికారంలో కూర్చోబెట్టాం. కావాల్సినంత ధైర్యం ఉన్నా గత ఎన్నికల్లో గెలవలేకపోయాం. ఈసారి మాత్రం గెలవడం ప్రామాణికంగా తీసుకుంటున్నా. ఉమ్మడిగా అధికారంలోకి వచ్చాక ఏ వైసీపీ శక్తులు మనల్ని ఆపలేవు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేస్తాం” అని పవన్ చెబుతున్నారు. ఏపీని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నానని, ఓట్లు చీలకుండా ఉండేలా చూసేందుకు ఎంత నలిగిపోయానో నా ఒక్కడికే తెలుసునని కార్యకర్తలకు వెల్లడించారు. జాతీయ నాయకుల దగ్గర ఎన్నో తిట్లు తిన్నాను.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయం అంటున్న పవన్ ను నమ్మి ఈసారైనా జనం ఆదరిస్తారా లేదా చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE