కోనసీమ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లపై పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంపైనైనా ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో కొంత వ్యతిరేకత సహజంగానే ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అభ్యంతరాలకు 30 రోజులు గడువు ఇచ్చారని, గొడవలు అవుతాయని ప్రభుత్వానికి తెలుసు కాబట్టే గడువు పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్ అయిన సమయంలోనే కోనసీమ అల్లర్లు చెలరేగాయని, ఇది ప్రజల దృష్టి మళ్లించడానికే అని పవన్ మండిపడ్డారు. కోనసీమకే అంబేడ్కర్ పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు. అప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా? అలాగే మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులను పోలీసులు బయటకు తరలించారని, అంటే మంత్రి ఇంటికి నిప్పు పెడతారని పోలీసులకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ ముందే తెలిస్తే మంత్రి ఇంటి వద్ద బందోబస్తు ఎందుకు పెట్టలేదు? అని ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా రాజకీయ లబ్ధికోసమే వాడుకోవడానికి చూస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ