ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా విజయసాయి రెడ్డి రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. పార్టీలో మొదటినుంచి కీలక నేతగా గుర్తింపు పొందిన ఆయన, పదవీకాలం పూర్తి కావొస్తుండటంతో సీఎం జగన్ మరోసారి విజయసాయి రెడ్డికి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి మంగళవారం నోటిఫికేషన్ను జారీచేశారు.
ఈ నేపథ్యంలో.. నలుగురు అభ్యర్థులూ, ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి అయిన పీవీ సుబ్బారెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే, నోటిఫికేషన్ ప్రకారం, ఈనెల 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయటానికి అవకాశం ఉంది. జూన్ 1న నామినేషన్లను పరిశీలించనుండగా, జూన్ 3వ తేదీ లోపు ఉపసంహరించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాగా శాసనసభలో వైసీపీకి 150 మంది సభ్యుల బలం ఉన్నందున అభ్యర్థులందరూ ఏకగ్రీవం కానున్నారు. ఒకవేళ నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్ 10వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ల అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేస్తున్నారన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ