తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశం అయ్యారు. అంతర్రాష్ట్ర ఒప్పందం, ఇతర విధి విధానాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ చర్చలు అనంతరం రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ముందుగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయి, అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్ల తిరుగుతున్నాయి వంటి అంశాలు పరిశీలించి, ఎలాంటి అసమానతలు లేకుండా సమ ప్రాతిపదిక విధానంలో బస్సులు నడిచే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల అధికారుల మధ్య విజయవాడలో ప్రాథమిక చర్చలు జరిగాయి, అనంతరం జూన్ చివర్లో హైదరాబాద్ లో మరోసారి జరగాల్సిన చర్చలు కరోనా పరిస్థితుల వలన వాయిదా పడ్డాయి. దీంతో ఈ రోజు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ లో భేటీ అయి బస్సు సర్వీసులు ప్రారంభంపై కీలకంగా చర్చిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu