అసని తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి, రైతాంగానికి ప్రభుత్వం భరోసా అందించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి” అని పవన్ కళ్యాణ్ కోరారు.
అలాగే ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని, ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పారు. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలకు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారని, పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్ళు దెబ్బ తిన్న వారిని ఆదుకోవాలని చెప్పారు. ఈ సమయంలో బాధితులకు బాసటగా నిలవాలని జనసైనికులు, పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ