దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “మహోన్నత ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు కు శత వందనాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పీవీ జన్మదినం అయిన జూన్ 28 నుంచి ఒక సంవత్సరంపాటు ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు కు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. భారత జాతి గర్వించదగిన తెలుగు ముద్దు బిడ్డడు పీవీ నరసింహారావు భారతరత్న పురస్కారానికి అర్హుడయిన మహా మనీషి అని” పవన్ కళ్యాణ్ అన్నారు
“పీవీ నరసింహారావు గురించి ఎంత చెప్పినా కొంత మిగిలిపోయే ఉంటుంది. స్వాతంత్య్ర ఉద్యమకారునిగా, తెలంగాణ విముక్తి పోరాట యోధునిగా, పదిహేడు భాషలపై పట్టు ఉన్న భాషాకోవిదునిగా, రాజనీతిజ్ఞుడుగా, పాత్రికేయునిగా, కవిగా, రచయితగా, న్యాయకోవిదునిగా ఇలా ఇన్ని సలక్షణాలు కలిగిన వారు బహు అరుదుగా వుంటారు. అందులో పీవీ అగ్రగణ్యులు. ముఖ్యంగా సరళీకృత ఆర్ధిక విధానాల ద్వారా మనదేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు, క్లిష్ట సమయంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని ఆయన నడిపిన విధానంలో ఆయనకు ఆయనే సాటి. మౌనంగా ఉంటూనే సమస్యలకు పరిష్కారం చూపే ఆయన ప్రజ్ఞ ఊహలకు అందనిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే కాదు, లెక్కకు మిక్కిలి పదవులను అధిరోహించిన పీవీ నరసింహారావు ఆ పదవులకు వన్నె తీసుకువచ్చి వాటికి ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారు. ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు బిడ్డగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతి సందర్భంగా నా తరఫున, జనసేన పార్టీ తరఫున నీరాజనాలు అర్పిస్తున్నానని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu