తెలుగు ప్రజలందరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాషను గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకువచ్చిన మహనీయులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి. ప్రజల వాడుకలో ఉన్న భాషనే గంథ రచనలోకి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో ఉద్యమించిన వ్యవహారిక భాషా ప్రేమికుడాయన. గిడుగు వెంకట రామమూర్తి చేపట్టిన వ్యావహారిక భాషోద్యమం వల్లే పల్లె పల్లెకు చదువు అందింది. అది మన మాతృభాషలో, అందునా వాడుక భాషలో చదువుకోవడం మూలంగా ఎక్కువ మందికి విద్యాబుద్ధులు అందాయి. ఈ రోజు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి. ఈ సందర్భంగా నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా వారికి అంజలి ఘటిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“గిడుగు వెంకట రామమూర్తి గారి లాంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలుగు భాషలోని తీయదనాన్ని నవ తరానికి, భావి తరాలకు అందించే సదుద్దేశంతో జనసేన మన నుడి-మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడటం అవసరం. అదే విధంగా ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించడమే కాదు అందులో వాడుక భాషను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఉత్తర్వులు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లోని భాష కొరుకుడుపడని విధంగా ఉంటోంది. అందరికీ అర్ధమయ్యే రీతిలో ఆ భాష ఉండాలి. ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరం నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టినప్పుడే గిడుగు వారికి నిజమైన నివాళిని ఇచ్చినట్లు అవుతుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu