ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వెళ్లే విధంగా లైట్ మెట్రో, మోనో రైల్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కొండపైకి రైలు మార్గం వేసే విషయంపై హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తో చర్చించామని, త్వరలో నివేదిక ఇవ్వమని కోరినట్టు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే ఆగమశాస్త్ర పండితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తిరుమలకు సంబంధించి రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్ రైల్ తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని, తీగలపై నడిచే వంటి రైళ్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొన్నారు.
మరోవైపు టీటీడీ ఖజానా గురించి దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ పేరుతో ట్విట్టర్లో జరుగుతున్న ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. టీటీడీకి చెందిన రూ.2,300 కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ అజిత్ డోవాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఇలాంటి ప్రచారం చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. అది అసలు అజిత్ ఢోబాల్ ట్విటర్ ఖాతాయే కాదని తెలిపారు. దేవుడి డబ్బును ఇష్టం వచ్చినట్టు వాడడానికి అవకాశం లేదని, భక్తుల కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. మరోవైపు టీటీడీ వ్యవహారాల నిమిత్తం అతి త్వరలోనే సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
[subscribe]