అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని అన్నారు. వైసీపీ హయాంలో దాదాపు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ “కౌలు రైతుకు అండగా ఉండాలి, వారి కుటుంబాల్లో భరోసా నింపాలనే ఈ యాత్ర ప్రారంభించాం. ఉదయం నుంచి నాలుగు కుటుంబాలను పరామర్శించి, రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించాం. రైతు కుటుంబాలను జనసేన పార్టీ తరఫున పరామర్శిస్తున్నామని తెలిసీ ప్రభుత్వం హుటాహుటిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తోంది. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వ్యక్తులకు కూడా ఇవాళ వారి కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ పని రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు చేస్తే చాలా బాగుండేది” అని అన్నారు.
ప్రతి జిల్లాకు సంక్షేమ నిధి:
జనసేన లేని సమస్యను సృష్టించదని, ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, దానిపై స్పందించాలని కోరుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. “కౌలు రైతు భరోసా యాత్ర వంటి కార్యక్రమం ప్రారంభించకపోతే ప్రభుత్వంలో చలనం రాదు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. అలాగే మా వంతు సాయం మేము చేస్తాం. అనంతపురంలో ఇది మొదట విడత. అన్ని జిల్లాలు తిరుగుతాం. ప్రతి కౌలు రైతు కుటుంబానికి భరోసా కల్పిస్తాం. వాళ్ల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా లెక్కన సంక్షేమ నిధి ఏర్పాటు చేసేలా ఆలోచన చేస్తున్నాం. ఈ సంక్షేమ నిధికి నా వంతు సాయం నేను అందిస్తానని” పవన్ కళ్యాణ్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ