జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 8వ తేదీన కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే అని అన్నారు. సుమారు 378 మంది కౌలు రైతులు గత మూడేళ్ల కాలంలో బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కౌలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 8వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడతారని, శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
“తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. మే 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పై పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లా రానున్నారు. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ సభ నిర్వహిస్తారు. రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తాం. కౌలు రైతులకు ఆర్థికంగా సాయపడే ఈ గొప్ప కార్యక్రమం గురించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రతి రైతుకు తెలియజెప్పాలి. వారికి మనం చేస్తున్న సాయం గురించి వివరించండి. రైతులకు తన వంతు సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచనను ప్రజలకు చెప్పాలి” అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ