భారతదేశ అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయం ఆరంభమైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అధ్వర్యంలో శుక్రవారం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికగా భారతదేశ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ను నింగిలోకి పంపింది. హైదరాబాద్కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ రాకెట్ను రూపొందించింది. ‘విక్రమ్-ఎస్’ అని పేరు పెట్టబడిన ఈ రాకెట్ను సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రంలోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి ఇస్రో ఈరోజు ఉదయం 11:30 గంటలకు ప్రయోగించింది. కాగా భారత అంతరిక్ష ప్రయోగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరుని ఈ రాకెట్కు పెట్టడం విశేషం. ఈ ప్రయోగాన్ని ఈ నెల 12నే చేపట్టాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో నేడు ప్రయోగించారు. ఇక ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శ్రీహరికోటకు విచ్చేసారు. ప్రయోగం అనంతరం కొన్ని నిమిషాలకే ఇది విజయవంతమైనట్లు ఇస్రో శాత్రవేత్తలు ప్రకటించారు.
కాగా విక్రమ్-ఎస్ రాకెట్ 6 మీటర్లు పొడవుతో 545 కిలోల బరువు కలిగి ఉంది. ఈ రాకెట్ మూడు కస్టమర్ పేలోడ్లుతో అంతరిక్షయానం సాగించగా, భూ ఉపరితలం నుంచి 103 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడానికి పట్టిన సమయం కేవలం 4నిమిషాల 50 సెకండ్లు మాత్రమే కావడం విశేషం. అక్కడి నుంచి ఉపగ్రహం భూమి మీద బంగాళఖాతం సముద్రం వరకు తీసుకువచ్చేలా రూపకల్పన చేశారు. భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో గాలిలో తేమ, వాతావరణ పరిస్థితులు, తిరుగు ప్రయాణంలో వేగం వంటి ముఖ్య దశలు ఉన్నట్లు శాత్రవేత్తలు తెలిపారు. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో చిన్నచిన్న దేశాలకు చెందిన ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు అవకాశముందని, తద్వారా మన దేశం వాణిజ్యపర ఆదాయాలు పొందే వీలుందని ఇస్రో భావిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE