ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతుండగానే అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎస్సీ వర్గీకరణను అనుసరించే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్పోరేషన్లకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్ల నిధులును ప్రభుత్వం మళ్లించిందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.
ఈ రోజు ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, సభను సజావుగా జరగనివ్వాలని స్పీకర్ సూచించారు. అనంతరం కోపంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభనుంచి వెళ్లిపోయారు. వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ నిరసనలు ఆగలేదు. ఎస్సీ కమిషన్ బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు కోరగా, తిరిగి అందరూ కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సభ నుంచి వాకౌట్ చేయాలని టీడీపీ సభ్యులు నిర్ణయించుకున్నారు.
[subscribe]