ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ, వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. వారం రోజులపాటు అధికారులు ఇసుక సరఫరా మీదే పనిచేసి, రాష్ట్రంలో ఇసుక కొరతపై ఇక ఎవరూ మాట్లాడకుండా చేసేలా వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇసుక కొరత సమస్యపై 13 జిల్లాల కలెక్టర్లతో నవంబర్ 12, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గతంలో రాష్ట్రంలో సరాసరి ఇసుక డిమాండ్ 80 వేల టన్నులు ఉందని, వరదల కారణంగా రీచ్లు మునిగిపోవడంతో డిమాండ్ను చేరుకోలేకపోయామని అన్నారు.
గత వారం రోజులునుంచి పరిస్థితి మెరుగుపడిందని, వినియోగంలోకి వచ్చిన రీచ్ల సంఖ్య 60 నుంచి 90కి పెరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందని, వచ్చే వారంలోగా ఇసుక వారోత్సవాలు సందర్భంలో రోజువారీ ఇసుక సరఫరాను 2 లక్షల టన్నులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్టాక్ పాయింట్లును 137 నుంచి 180 వరకూ పెంచాలి. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలని చెప్పారు. ఎల్లుండిలోగా రేటు కార్డును నిర్ణయించాలి. రేటు కార్డును మించి ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే వాహనాలు స్వాధీనం, జరిమానాతోపాటు రెండేళ్ల వరకు జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక కొరత సమస్య తీరే వరకూ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని, అన్ని సరిహద్దుల్లోని రూట్లలో చెక్పోస్టులు పెట్టాలన్నారు. 10 రోజుల్లోగా ఆ చెక్పోస్టులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు.
[subscribe]