మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అబ్దుల్ కలామ్ పేరిట ఇస్తున్న పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నీ తన దృష్టికి తీసుకురాకుండా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన ఈ రోజు స్పందించారు. పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ప్రతిభా పురస్కారాలకు ఎప్పటిలాగానే అబ్దుల్ కలాం పేరునే కొనసాగించాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఇతర అవార్డులకు సైతం దేశంలోని పలువురి మహానీయులు పేర్లు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దేశానికి పేరు తెచ్చిన గొప్ప వ్యక్తులైన మహాత్మ గాంధీ, జగ్జీవన్రామ్, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ వంటి మహానీయుల పేర్లుతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతిలో అత్త్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నారు. గత సంవత్సరం వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులను కూడ ఈ అవార్డుకు పరిగణించేవారు, అయితే ఈ సంవత్సరం నుంచి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఇవ్వనున్నారు. నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజున విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. గతంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, ఈసారి నుంచి ప్రతి జిల్లాలో నిర్వహించనున్నారు.
[subscribe]