కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిలో ఎమ్మెల్సీ హస్తం ఉండటంతో ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగానిచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తూ కలెక్టర్ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ అర్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామకం కింద ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్వో) ఎ. హనుమంతు రావుకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ననుసరించి అపర్ణకు ఉద్యోగమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం స్పందన కార్యక్రమంలో తెలియజేశారు.
కాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిన సంగతే. దీనిపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలిపిన తర్వాత ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పటికే ఆయనను వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రమణ్యం తల్లి నూకరత్నం అన్నారు. ఈ మేరకు గవర్నర్, సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు. అయితే మృతిచెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఆయన భార్య అపర్ణకు తాజాగా ఉద్యోగం ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY