తెలంగాణలో ఐదవరోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ కార్మికుల జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే, అవసరమైతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో గత ఐదేళ్ల నుంచి 7000 మంది పదవి విరమణ పొందినా, ఒక్క నియామకం కూడ చేపట్టలేదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెకు ఇతర ఉద్యోగ సంఘాలు కూడ మద్దతు ఇవ్వాలని కోరారు.
గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఎంతో గొప్పగా పోరాటం చేసాయని, ఇప్పుడు అటువంటి స్ఫూర్తితోనే ఆర్టీసీని కాపాడుకోవడానికి సమ్మె చేస్తున్నామని అన్నారు. సమ్మె చేస్తుంది జీతాలు కోసం కాదని, ఆర్టీసీని బతికించుకోవడమే కార్మికుల లక్ష్యం అని చెప్పారు. ఆర్టీసీపై డిజిల్ భారం పెద్ద ఎత్తున పడుతుందని, డీజిల్ పై 27శాతం పన్ను వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా ఈ సమ్మెకు పూర్తీ స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకుడు చాడ వెంకట రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, జనసేన తెలంగాణ ఇంచార్జ్ ఎన్.శంకర్ గౌడ్, బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, ఇతర జేఏసీ నాయకులు తదితరులు హాజరయ్యారు. అఖిలపక్షంలో సమ్మె పై చర్చిస్తున్నారు, సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
[subscribe]