మరోసారి పవన్‌తో కొణతాల భేటీ

Konatala Meeting, Pawan Kalyan, Konatala Meeting with Pawan Once Again, Konathala Ramakrishna, Janasena, AP Politics, Konatala Ramakrishna, Jana Sena Party, North coastal Andhra Pradesh leader, AP Latest News Updates, Pawan Kalyan Latest News, AP Political Updates, Mango News Telugu, Mango News
Konathala Ramakrishna, Janasena, Pawan kalyan, AP Politics

కొణతాల రామకృష్ణ.. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నేత. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంతో.. ఆయన్ను చేర్చుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ 1989లో కాంగ్రెస్ తరుపున అనకాపల్లి నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సమయంలో కేవలం 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. అదే స్థానం నుంచి 1991లో కూడా కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. హ్యాట్రిక్ కొడుదామని 1996లో కూడా రామకృష్ణ అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగారు. కానీ ఈసారి రామకృష్ణకు ఓటమి ఎదరయింది. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన ఓడిపోయారు.

ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి కొణతాల గెలుపొందారు. అదే సమయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొణతాల ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో త్వరలో ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే కొణతాల రామకృష్ణ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ తర్వాత తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వయంగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కానీ తాను కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా లేనని కొణతాల.. షర్మిలతో అన్నారట. అయితే షర్మిల కలిసిన రెండు రోజులకే కొణతాల మరోసారి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం కొణతాల రామకృష్ణ.. పవన్ కళ్యాణ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది.

త్వరలో జనసేన పార్టీ అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల సంఖ్యలో జనాల్ని పోగేస్తున్నారు. ఈ సభలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో కొణతాల రామకృష్ణ జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకే పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యానని కొణతాల రామకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితులు, ఉత్తరాంధ్ర రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిలు జరిపామని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eight =