తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ తరుపున బరిలోకి దిగిన కౌశిక్ రెడ్డి.. తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిపై 16,873 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌశిక్ రెడ్డికి 80,333 ఓట్లు పోలయ్యాయి. అయితే ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ.. ప్రచారం సమయంలో కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై పలువురు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
నవంబర్ 28న కౌశిక్ రెడ్డి తన భార్య, కుమార్తెలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడుతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే విజయాత్ర అని.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర అని వ్యాఖ్యానించారు. తన భార్య, కూతురు పక్కన ఉన్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సుమోటోగా తీసుకున్న ఎన్నికల సంఘం వెంటనే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది.
అయితే తాజాగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. వెంటనే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో తాను గెలిచిన తర్వాత ఏం చేస్తామో నేతలు చెప్పాలని అన్నారు. తనను గెలిపించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. అలాకాకుండా ప్రజలను బెదిరింపులకు గురిచేసి ఓట్లు అడగడం సరికాదని అన్నారు. కౌశిక్ రెడ్డితో పాటు అటువంటి బెదిరింపులకు పాల్పడివారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి గవర్నర్ సూచించారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE