ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11, శనివారం నాడు విజయవాడలో ఆయన ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముందుగా పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలకు మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు కుదించడంతో పాటుగా, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించేలా చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన దస్త్రానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో ఆయన ఈరోజు నూతన ఎన్నికల కమిషనర్ గా ఆయన బాధ్యతలు తీసుకొన్నారు. జస్టిస్ కనగ రాజ్ 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయిన ఆయన 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu