ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అనూహ్యంగా నాలుగు స్థానాలు దక్కించుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. చేజారిన నాలుగు స్థానాలపైనే చర్చ నడిచింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారన్న కారణం చూపుతూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం తెలిసిందే. దీంతో అధికార పార్టీ నేతలు టీడీపీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న సీఎం జగన్ అధ్యక్షతన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం మీద సమీక్షా సమావేశం జరుగగా.. ఈ సమావేశానికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశానికి రానివారిపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి.
వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన కొంతకాలంగా సీఎం జగన్ పై అసంతృప్తితో ఉన్నారని.. పార్టీకి ఆయనకు గ్యాప్ రావడంతోనే సమావేశానికి దూరంగా ఉన్నారనే వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారతాననేది అవాస్తవమని, రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటానని, లేడాంటే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఇంట్లో శుభకార్యం మరియు పంటి సర్జరీ వంటి కారణాలతోనే నిన్న సీఎం సమావేశానికి హాజరుకాలేదని తెలిపిన ఆయన, తనకు ఎప్పటికి నాయకుడు జగన్ మోహన్ రెడ్డే అని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే మంగళగిరిలో పోటీ చేస్తానని, లేదంటే లేదని.. అయితే దీనిపై తమ బాస్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE