తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) ప్రశ్నాపత్రాల వరుస లీకేజీ ఘటనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్న ఆమె, విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా చదువు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థం పక్కన పెట్టాలని మంత్రి సబిత పిలుపునిచ్చారు. ఇక పదో తరగతి పరీక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలోని కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ, పోస్టల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
మంగళవారం వరంగల్ జిల్లాలో హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన అంశంపై మంత్రి ఆరా తీశారు. దీనిలో వాస్తవాలు తేల్చేందుకు సీపీకి ఫిర్యాదు చేయాలని వరంగల్, హనుమకొండ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరంగల్ డీఈవో వాసంతి సీపీకి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హిందీ పేపర్ లీకేజీపై సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది లీకేజీ కాదని, సగం పరీక్ష అయ్యాక సోషల్ మీడియాలో వచ్చిందని తెలిపారు. ఒక మీడియా చానల్ మాజీ రిపోర్టర్ ద్వారా ఇది సోషల్ మీడియాలో వచ్చిందని, అయితే అతనికి ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉందని చెప్పారు. పరీక్ష మొదలైన గంట తర్వాత పేపర్ సోషల్ మీడియాలో వచ్చినట్లు గుర్తించామని, ఇన్విజిలేటర్ ఫోన్ తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని, త్వరలోనే విచారణ పూర్తి చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE