ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మరియు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మార్చ్ 19, గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చ్ 23 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చ్ 31 నుంచి పదవ తరగతి పరీక్షలు యధాతధంగా నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పింస్తున్నామని తెలిపారు. జలుబు దగ్గుతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ప్రత్యేక రూంల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఇతర కోచింగ్ సంస్థలు, నర్సింగ్ కళాశాలలకు అన్నింటికీ మార్చ్ 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. హాస్టళ్లకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులందరిని క్షేమంగా సొంతగ్రామాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మార్చ్ 31 తర్వాత మరోసారి పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాన్నీ వెల్లడిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా రాష్ట్రంలో ఎక్కడైనా విద్యాసంస్థలను నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.
[subscribe]