సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ మార్చ్ 16న కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి పదవీవిరమణతో ఖాళీ అయిన స్థానంలో జస్టిస్ గొగోయ్ని నామినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 19, గురువారం నాడు రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ, రాజ్యసభలో న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు విషయాలను చర్చించే అవకాశాన్ని వినియోగించుకుంటానని తెలిపారు.
అయితే రాజ్యసభకు జస్టిస్ రంజన్ గొగోయ్ ను కేంద్రప్రభుత్వం నామినేట్ చేయడాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయం వలన న్యాయవ్యవస్థపై ప్రభావం ఉంటుందని, ఇటువంటివి తప్పుడు సంకేతాలు పంపిస్తాయని పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకార సమయంలో కూడా రాజ్యసభలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల సభ్యుల నుంచి రంజన్ గొగోయ్ నిరసనలను ఎదుర్కొన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సభ్యులు సభ నుండి వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది.