ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు ప్రకటించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పవర్ హాలిడేను రద్దు చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగం 180 మిలియన్ యూనిట్లుగా ఉందని, విద్యుత్ వినియోగం తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు సరిపడినంత అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించనున్నామని, ఆరు నెలల్లోగా దీనిని పూర్తి చేయటానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో మరో రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిపారు.
కృష్ణపట్నం లోని ప్లాంట్ నుంచి ఒక నెలలో 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని, అలాగే ఎన్టీటీపీఎస్ ద్వారా మరో మూడు నెలల్లో ఇంకో 800 మెగావాట్ల విద్యుత్ వినియోగంలోకి రానుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుగా ఉందని, అయితే 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించారు. తద్వారా రోజుకు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందని, దీనిలో 30 మిలియన్ యూనిట్లను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలకు 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నామని, ఇక ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలు, ఆక్వా పరిశ్రమలు వంటి వాటికి 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ