తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నంలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆసుపత్రికి తరలించే లోపుగానే ఆయన తుది శ్వాస విడిచారు. 1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో ఉన్న డాలర్ శేషాద్రి, 2007లోనే రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఓఎస్డీగా నియమించడంతో తిరుమల శ్రీవారి ఆలయంలోనే సేవలు అందిస్తున్నారు. ఇక డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖపట్నం నుంచి తిరుపతికి తరలించారు.
డాలర్ శేషాద్రి మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న శ్రీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారని, ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి అని అన్నారు. “అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను” అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
“తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రిగారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన జీవితపు చివరి క్షణాల వరకు స్వామివారి సేవలలో తరించిన శేషాద్రిగారు ధన్యజీవి. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. శ్రీవారి దర్శనానికి నేను ఎప్పుడు వెళ్లినా ఆయన దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. శేషాద్రి గారికి పుణ్యగతులు ప్రాప్తించాలని ఆ గోవిందుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ