ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, పరిపాలనా సౌలభ్యం, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ది దృష్ట్యా ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 4న వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 26 జిల్లాలకు అదనంగా మరో కొత్త జిల్లా ఏర్పాటుపై కీలక వ్యాఖలు చేశారు.
“ఏపీలో 42 సంవత్సరాల తర్వాత కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మరో జిల్లా కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేసి పరిశీలిస్తున్నాం. ట్రైబల్/గిరిజన ప్రాంతాలకు సంబంధించి మొత్తాన్ని కలిపి మూడు జిల్లాలు చేయడంపై ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే అందులో రెండు జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాలు కలుపుతూ ఇంకో జిల్లా కూడా ఏర్పాటు చేయడంపై సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారు” అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రంపచోడవరం జిల్లా ఏర్పాటుపై ఇప్పటికే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తునట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరో జిల్లా ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకుంటే ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 27కు చేరుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ