తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పటినుంచి రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని ఆరోపించారు. చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయని, ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయలేకపోతోందని విమర్శించారు. చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని తమపై బురద చల్లాలని చూస్తున్నారని, ఇదేం రాజకీయమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో తన మేనల్లుడు కూడా ఉన్నాడని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారని.. దీనిపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మా పిల్లలందరినీ డ్రగ్స్ టెస్టులకు తీసుకొస్తానని మీడియా ముందే వారికి టెస్టులు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో 24 గంటల పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. మొన్న దాడులలో పట్టుబడిన వారిలో 125 మందికి డ్రగ్స్ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ