కృష్ణా జలాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం అందించారు.
ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి జలాలపై ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కోరుతూ కేంద్ర జల్శక్తి శాఖ లేఖ రాసింది. కాగా గత ఆరేళ్లలో రెండురాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి ఒకే ఒక్కసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగింది. 2015లో జరిగిన ఆ భేటీకి అప్పటి సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, మరియు అప్పటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu