రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు ఏళ్ల తరబడ ప్రజలను పాలించేవాళ్లు.. కారాగారం పాలవుతారు. అలాగే ఒకప్పుడు కటకటాల వెనుక గడిపిన వాళ్లు ఇప్పుడు ప్రజలను ఏలుతూ ఉంటారు. అచ్చంగా అదే జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఏపీ సీఎంను గద్దెను దింపడానికి అహో రాత్రులు కష్టపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు సీఐడీ అధికారులు. అయితే అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎప్పుడూ ఊహించని సంఘటనలు జరుగుతూ పొలిటికల్ వేడిని మరింత పెంచేస్తున్నాయి.
ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో టీడీపీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం అవనుండటంతో.. చంద్రబాబు అరెస్ట్ను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నుంచి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి రోడ్డెక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితులనే తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర రాజకీయాలను తమవైపు తిప్పుకోవాలని నారా వారి కుటుంబం భావిస్తోంది.మరోవైపు లోకేశ్ అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందన్న వార్తలతో పార్టీలో కీలక బాధ్యతలను చేపట్టడానికి బ్రాహ్మణి సిద్ధం అవుతున్నారు.
నిజం చెప్పాలంటే చంద్రబాబు అరెస్ట్తో ఒక్కసారిగా టీడీపీ షాక్కు గురైంది. అదే సమయంలో చంద్రబాబును కలిసిన జనసేనానిని..టీడీపీ, జనసేన పొత్తును అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని తేల్చేశారు. అంతేకాదు బీజేపీ తమతో కలిసి రావాలని ..కాదు కాదు కలిసి వస్తుందని తాము నమ్ముతున్నామని చెప్పారు. అయితే దీనిపై త్వరలోనే హస్తినకు వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ..టీడీపీతో పొత్తు దిశగా ప్రయత్నాలు చేసిన పవన్..ఇప్పుడు పొత్తు వల్ల లాభాలు.. పొత్తు ప్రకటన వెనుక ఉన్నకారణాలను వివరిస్తానని పవన్ చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణలో కేంద్ర పెద్దలు బిజీగా ఉండటంతో.. ఆ తరువాతే ఏపీ వ్యవహారాల పైన ఫోకస్ పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో తెలంగాణలో షర్మిలను అరెస్ట్ చేసి కేవలం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లినపుడే ప్రధాని మోడీ ఫోన్ చేసి షర్మిలతో మాట్లాడారు. కానీ ఇప్పుడు చంద్రబాబును రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచినా కూడా ఇప్పటి వరకు బీజేపీ పెద్దలెవరూ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కుటంబంతో మాట్లాడటం కానీ.. కనీసం దానిపై ఓ ప్రకటన ఇవ్వకపోవడంపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇక లోకేశ్ అరెస్ట్ కూడా త్వరలోనే అని వైసీపీ నేతలు పదేపదే చెబుతూ ఉండటంతో..టీడీపీ అలర్ట్ అయింది. ఈ సమయంలో బ్రాహ్మణి పాత్ర కీలకం కాబోతోంది. ఇప్పటికే రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా.. టీడీపీ ర్యాలీల్లో పాల్గొన్న బ్రాహ్మణి తొలిసారి వైసీపీ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేశారు. ఏ రోజూ బయటకు రాని చంద్రబాబు భార్య భువనేశ్వరి బయటకు వచ్చారని.. ఏపీ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులే అని సెంటిమెంట్ను రగిలించారు. అంతేకాదు రేపు లోకేశ్ను అరెస్ట్ చేసినా తాము భయపడే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. దీంతో బ్రాహ్మణి రాజకీయంగా జరిగే ఎలంటి పరిణామాలనైనా ఎదుర్కోవటానికి రెడీయేనన్న సంకేతాలు ఇచ్చినట్లే అయింది. అయితే ఏ క్షణమైనా లోకేశ్ అరెస్ట్ జరిగితే.. పార్టీలో బ్రాహ్మణికి కీలక బాధ్యతలు అప్పగించేలా కసరత్తు సిద్ధం అయిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి..
ఎందుకంటే నారా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్తే.. ప్రజల నుంచి సానుకూలత పెరుగుతోందని.. మహిళా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని టీడీపీ అంచనా వేస్తోంది.గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు తల్లి, చెల్లి ప్రజల్లోకి వెళ్లడమే అప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి కారణం అయింది. ఇప్పుడు అదే సెంటిమెంటును ఫాలో అయిద బ్రాహ్మణిని రంగంలోకి దించడానికి రెడీ అవుతోంది టీడీపీ. అయితే బ్రాహ్మణి ఇప్పటి వరకు రాజకీయాలలో ఎప్పుడూ వేలు పెట్టలేదు. హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాలకే ఆమె పరిమితం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్తో అత్త భువనేశ్వరితో కలిసి నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అరెస్టుల వ్యవహారమే ప్రచారాస్త్రంగా మలుచుకుని.. వైసీపీ దురాగతాలను ఎండగట్టే విధంగా బ్రాహ్మణి ప్రజల్లోకి వెళ్లడానికి కార్యాచరణ సిద్దం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE