చాలా రోజులుగా టీడీపీ, జనసేన పొత్తు వార్తలు రెండు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్నా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఫీషియల్ ప్రకటనతో దీనికో స్పష్టత వచ్చినట్లు అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో .. చంద్రబాబును కలిసి వచ్చాక పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీలో గుబులు పుట్టిస్తే.. జనసేన, టీడీపీ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ ముందునుంచీ చెబుతున్న పవన్.. అదే మాటపై నిలబడ్డారు. అంతేకాదు బీజేపీని కూడా పొత్తుకు ఆహ్వానించడానికి త్వరలోనే పావులు కదుపుతున్నారు జనసేనాని.
ఒకవిధంగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులకు దారి తీసినట్లు అయింది. ఈ ప్రకటనను కొందరు సమర్థిస్తే, కొందరు వ్యతిరేకించారు. వైసీపీ పార్టీ నేతలైతే.. ఊహించిందే అన్నారు. తాజాగా ఈ జనసేన, టీడీపీ పొత్తులో మరో అడుగు ముందుకు పడబోతోంది. ఈ నెలలోనే జనసేన, టీడీపీ రెండు పార్టీలూ కలిసి..సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించ బోతున్నాయి. ఈ కమిటీ సమావేశంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై రెండు పార్టీలు చర్చించుకోనున్నాయి.
ఈలోగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాజమండ్రి జైలులో చంద్రబాబుతో మరోసారి ములాఖత్కు రెడీ అవుతున్నారు. ఈ ములాఖత్లో సమన్వయ కమిటీలో సభ్యులుగా ఎవర్ని ఉంచాలనే అంశంపై చర్చించనున్నారు. దీని కోసం ఈ రెండు పార్టీలూ ఇప్పటికే కమిటీ సభ్యుల పేర్లతో.. ఓ జామితాను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ములాఖత్ తర్వాత.. తెలుగు దేశం పార్టీ తరపున కమిటీలో సభ్యులుగా ఎవరుంటారో టీడీపీ నేత నారా లోకేశ్ ప్రకటించాక పవన్ కళ్యాణ్ కూడా జనసేన సభ్యులను ప్రకటిస్తారు. దాని తర్వాత రెండు పార్టీల కమిటీల సభ్యులు.. పవన్ కళ్యాణ్, లోకేష్ని కలిసి.. కమిటీ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించాలో తెలుసుకుంటారు. ఆ తర్వాత ఓ సమావేశం నిర్వహించి..అందులో తాము భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల గురించి.. రెండు పార్టీలు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తాయి.
అంతేకాదు ఈ నెలలో జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో.. రెండు పార్టీలకు సంబంధించిన సీట్ల పైన ఇంకా చర్చ ఉండదని తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా చంద్రబాబును ఈ కేసునుంచి ఎలా బయటకు తీసుకురావాలి. ఎలా బెయిల్ రప్పించాలి అన్న అంశాలతో పాటు వైసీపీని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి..విజయ వారాహి యాత్ర, యువగళం యాత్రలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత రెండు పార్టీల సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE