తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పార్టీ ఇన్ ఛార్జ్ లు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అడ్మిస్ట్రేటివ్ రిఫార్మ్స్ను రాష్ట్రంలో తీసుకు వచ్చింది నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, అలాగే ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ అలుపెరగని కృషి చేస్తుందని, అలాగే పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని తెలిపారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు ఇక ప్రజలకు పాలకులుగా ఉన్నవారికి కావాల్సింది విజన్ అని, విద్వేషం కాదని చంద్రబాబు హితవు పలికారు. ఇక ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు నాయుడు మరోసారి వివరణ ఇచ్చారు. ఎన్డీఏలో టీడీపీ చేరికపై వస్తున్న వార్తల గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర పునర్ణిర్మాణం కోసం చేసే కార్యక్రమాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని, రాష్ట్ర అవసరాలను బట్టి పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకు తాను ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడలేదని, పార్టీలోని నాయకుల్లో కూడా దీనిపై ఈ స్పష్టత ఉండాలని చంద్రబాబు సూచించారు.
మన పోరాటం పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసమన్న విషయం గుర్తెరిగి పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోందని, మనందరం కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని, తద్వారా రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఈ క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిడిపి తరపున అభ్యర్థులుగా.. పశ్చిమ రాయలసీమ స్థానానికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ స్థానానికి కంచర్ల శ్రీకాంత్ అభ్యర్థిత్వాలను ప్రకటించిన చంద్రబాబు, విశాఖపట్నం స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ